లండ‌న్ వేదికగా ప్రారంభమైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్

లండ‌న్ వేదిక‌గా ప్ర‌పంచ ప‌ర్యాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో తెలంగాణ మెరిసింది. ఆవిర్భవిస్తున్న సాంకేతిక ప‌రిజ్ఞానం – ప‌ర్యాట‌క రంగానికి మేలు చేసే అవ‌కాశాలు (పర్యాటకంలో మంచి కోసం ఎమర్జింగ్ టెక్నాలజీ యొక్క సంభావ్యత ఈ సంవత్సరం థీమ్) థీమ్‌తో లండ‌న్‌లోని ఎక్సెల్ హాల్స్‌లో జరుగుతున్న 44వ వరల్డ్ ట్రావెల్ మార్ట్‌లో పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరియు తోటి ఎమ్మెల్యే లతో కలిసి పాల్గొనడం జరిగింది.. ఈ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలు, భార‌త్ నుంచి 10కి పైగా రాష్ట్రాలు పాల్గొంటున్నాయి.

తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక స్టాల్‌ను పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలసి మంత్రి ప్రారంభించారు. అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించేలా తెలంగాణ ప‌ర్యాట‌క అందాలు, చారిత్ర‌క‌ ప్ర‌దేశాల ఛాయ‌చిత్రాల‌ను డిజిటల్ స్క్రీన్‌లో ప‌ర్యాట‌క శాఖ ప్ర‌ద‌ర్శించింది.తెలంగాణ పర్యాటక స్టాల్‌ను యూకేలో భారత హైకమిషనర్ విక్రమ్ దురై, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హా, గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖంటే, ఒడిషా డిప్యూటీ సీఎం ప్రవతి ఫరీదా, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన AVని తిలకించారు.

అనంతరం తెలంగాణ టూరిజం ప్రమోషన్‌లో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ కావడం జరిగింది. ప్రతిష్టాత్మక లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్ ఆల్యూర్ రెహమాన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యి పర్యాటక శాఖ అభివృద్ధిలో భాగంగా విదేశీ పెట్టుబడులు, హైదరాబాద్‌లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్ ఏర్పాటు, లండన్ ఐ తరహాలో హైదరాబాద్‌లో జాయింట్ వీల్ ఏర్పాటు చేయడం, తదితర అంశాల గురించి చర్చించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు.ఈ సందర్భంగా తెలంగాణలో టూరిజం అభివృద్ధికి, పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో చేపడుతున్న కార్యక్రమాలను, తెలంగాణ పర్యాటక ప్రదేశాల గురించి మంత్రి వారికి వివరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి గారు ప‌ర్యాట‌క రంగ‌పై ప్రత్యేక దృష్టి సారించ‌డంతో ప్రపంచ పర్యాటక యవనికపై తెలంగాణ టూరిజం తనదైన ప్రత్యేకతను చాటుతోందని అన్నారు. ప‌ర్యాట‌క అభివృద్ధికి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్లుతున్న‌ట్లు తెలిపారు. తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకే వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం ఎంతో అవసరమని అన్నారు.